Mobile Popup Ad
Mobile Popup Ad

​పొలాల్లోకి దూసుకెళ్లిన లారీ.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం నాగులవంచ సమీపంలో శనివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్లు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఒక లారీ, నాగులవంచ గ్రామ సమీపంలోని మూల మలుపు వద్దకు రాగానే అదుపు తప్పింది. వేగంగా దూసుకెళ్లిన లారీ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టి, అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ముదిగొండ మండలానికి చెందిన లారీ డ్రైవర్ కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. చెట్టును ఢీకొన్న వేగానికి ఆయన లారీలోంచి కింద పడిపోయి అపస్మారక స్థితికి చేరుకోగా, గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

​ఇదిలా ఉండగా, నాగులవంచ అంబేద్కర్ సెంటర్ వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి అక్కడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో బోనకల్లు మండలం గార్లపాడు గ్రామానికి చెందిన అప్పారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని, బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒకే రోజు స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ రెండు ప్రమాదాలపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>