కలం, వెబ్ డెస్క్: వియత్నాంలోని డానాంగ్లో జరుగుతున్న యూ23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్(U23 Asian Championship)లో భారత్ అద్భుతమైన బోణీ కొట్టింది. పోటీల మొదటి రోజే భారత గ్రెకో-రోమన్ రెజ్లర్లు సాగర్ సింగ్, సూరజ్ తమ పట్టుదలతో ఫైనల్కు దూసుకెళ్లారు. టియెన్ సన్ స్పోర్ట్ సెంటర్లో జరిగిన ఈ మ్యాచ్ల్లో గెలిచి, ఇద్దరూ స్వర్ణ పతక పోరుకు సిద్ధమయ్యారు. తొలిరోజు ఆటలో 67 కేజీల విభాగంలో సాగర్ సింగ్ అటాకింగ్ గేమ్తో ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. వ్యూహాత్మకంగా ఆడుతూ వరుస రౌండ్లలో గెలిచి ఫైనల్ చేరారు.
అటు 60 కేజీల విభాగంలో సూరజ్ కూడా అదే నమ్మకంతో ఆడి టైటిల్ పోరుకు అర్హత సాధించారు. దీంతో భారత్కు కనీసం రెండు రజత పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు 77 కేజీల విభాగంలో కుమార్ సచిన్ సెమీఫైనల్ వరకు వెళ్లినా, అలీఖాన్ దుర్సనోవ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అలాగే 72 కేజీలు, 82 కేజీల విభాగాల్లో బరిలోకి దిగిన మిగతా భారత రెజ్లర్లు గట్టి పోటీ ఎదురవ్వడంతో తొలి రౌండ్లలోనే వెనుతిరిగారు.
ఈ ప్రదర్శనపై భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందించారు. ఫైనల్ చేరిన ఆటగాళ్లకు ఆయన అభినందనలు తెలిపారు. వియత్నాంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని, అయినా మన అథ్లెట్లు గొప్ప పట్టుదలను చూపిస్తున్నారని చెప్పారు. వారి కష్టాన్ని చూసి గర్వపడుతున్నామని, రాబోయే రోజుల్లో పోటీ పడేవారందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. ఈ టోర్నీలో భారత గ్రెకో-రోమన్ రెజ్లర్ల పోరాటం ఆదివారం కూడా కొనసాగనుంది.
ఆదివారం జరిగే క్వాలిఫికేషన్ రౌండ్లలో 55 కేజీల విభాగంలో నీరజ్, 63 కేజీల విభాగంలో సుమిత్, 87 కేజీల విభాగంలో రోహిత్ బురా బరిలోకి దిగనున్నారు. వీరంతా క్వార్టర్ ఫైనల్స్ చేరి భారత్ జోరును ఇలాగే కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టోర్నీలో భారత రెజ్లర్లు మరిన్ని పతకాలు సాధిస్తారో లేదో వేచి చూడాలి.

