కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi)ని తన కుటుంబ సమేతంగా కలవడం తన జీవితంలో ఎప్పటికీ మరువలేని అత్యంత భావోద్వేగ క్షణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రధానితో దిగిన ఫోటోలను పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశ ప్రధానిని తమ కుటుంబంతో కలిసే అదృష్టం దక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రధాని మోదీ అసాధారణ వ్యక్తిత్వం, ఆప్యాయత తమ కుటుంబంలోని మూడు తరాల వారిని ఒకేలా ఆకట్టుకుందని తల్లి, భార్య, కుమార్తెలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు అంతటి అపారమైన ఆదరణ పొందారో ఈ భేటీ ద్వారా తనకు మరింత స్పష్టంగా అర్థమైందని రామ్మోహన్ నాయుడు వివరించారు.
ఈ కలయికలో తమ కుటుంబానికి ఎదురైన ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని రామ్మోహన్ నాయుడు గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ తెలుగులో అమ్మ పేరిట ఒక మొక్క అనే మహత్తర కార్యక్రమానికి ప్రేరణగా తన తల్లి స్వయంగా ప్రధానమంత్రికి ఒక మొక్కను బహుకరించారని, ఇది తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తమపై చూపిన అపారమైన ప్రేమ, ఆప్యాయతలకు, అందించిన ఆశీస్సులకు ప్రధానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. దేశ ప్రధానిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, తమ కోసం అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు గాను నరేంద్ర మోదీకి రామ్మోహన్ నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

