కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ధికి రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ ముందుకు వచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద నిధులు అందజేశాయి. ఈ మేరకు శనివారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యా శాఖతో రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా సీఎంకి రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి.రహేజా, రామ్ కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు ఒప్పంద పత్రాలను అందజేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కొత్త ప్రాంగణ నిర్మాణానికి రాంకీ సంస్థ రూ.19.66 కోట్లు ఖర్చు చేయనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ZPHS ఉన్నతీకరణ లో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదవ తరగతి, ఇంటర్ తరగతుల నిర్మాణానికి 10.4 కోట్లు ఖర్చు పెట్టనుంది. రహేజా గ్రూప్ రూ. 50.50 కోట్లను రంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల అభివృద్ధికి కేటాయించనుంది.
అలాగే, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్ నగర్ MPPS లో ప్రీ ప్రైమరీ, 6వ, 7వ తరగతుల నిర్మాణానికి యశోదా హాస్పిటల్ రూ. 12.20 కోట్ల ను ఖర్చు పెట్టేందుకు ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

