కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం (Mental Health Awareness) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ విద్యార్థులు నర్సింగ్ విద్యార్థుల కోసం పోస్టర్ పోటీలు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన, సృజనాత్మకత సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు. ముఖ్యంగా సైకియాట్రీ పీజీ విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాలు, మత్తు పదార్థాల నివారణ (డ్రగ్ డీ-అడిక్షన్) అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రజల్లో మానసిక వ్యాధులు, మత్తు పదార్థాల వ్యసనంపై ఉన్న అపోహలను తొలగించడం, ముందస్తు గుర్తింపు చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎల్. రాములు గౌరవ అతిథిగా పాల్గొని, విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు మానసిక వైద్య విభాగం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని మానసిక వైద్య విభాగాధిపతి ప్రొఫెసర్ డా. విశాల్ అకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్లు ప్రదీప్, రమణ, అరుణ్, సైకియాట్రీ పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

