Mobile Popup Ad
Mobile Popup Ad

రూ.15 గొడవతో మొదలై ఆసియా గోల్డ్‌ వరకు యాసిర్ ప్రయాణం

కలం, వెబ్ డెస్క్: కేవలం 15 రూపాయల కోసం జరిగిన చిన్న గొడవ… ఒక బాలుడి జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు అదే బాలుడు ఆసియా అండర్-15 బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 14 ఏళ్ల మొహమ్మద్ యాసిర్. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత యాసిర్ స్వగ్రామం రాజౌరిలో ఘన స్వాగతం లభించింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి అతడిని భుజాలపై ఎత్తుకుని సంబరాలు జరిపారు.

కానీ యాసిర్ ప్రయాణం అంత సులభం కాదు. ఆరేండ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. కొంతకాలానికి ప్రభుత్వ ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌లో వారి ఇంటిని అధికారులు కూల్చేశారు. దీంతో కుటుంబం నిరాశ్రయంగా మారింది. తల్లి నసీమా ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. యాసిర్ కూడా జీవనోపాధి కోసం పార్ట్‌టైమ్ వంట పనులు చేశాడు. అలాంటి సమయంలో స్థానిక స్టేడియంలో బాక్సర్లకు నీళ్లు అందించే పని చేసేవాడు.

ఒకరోజు 15 రూపాయలు ఇవ్వలేదనే కారణంతో ఓ బాక్సర్‌తో అతడికి గొడవ జరిగింది. ఆ గొడవను దూరం నుంచి గమనించిన కోచ్ ఇష్టియాక్ మాలిక్… యాసిర్‌లో ఉన్న ఫైటింగ్ స్పిరిట్‌ను గుర్తించాడు. వెంటనే అతడిని బాక్సింగ్ వైపు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఖేలో ఇండియా పథకం కింద యాసిర్‌కు శిక్షణ ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా కష్టపడి సాధన చేసిన అతడు ఇప్పుడు ఆసియా స్థాయిలో గోల్డ్ గెలిచాడు.

డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెరిగిన తాను… బాక్సింగ్ లేకపోతే తప్పుదారిలో వెళ్లిపోయేవాడినని యాసిర్ తెలిపాడు. కోచ్ సహాయం వల్లే తన జీవితం మారిందని చెప్పాడు. యాసిర్ ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చాడని, కానీ కష్టాలను జయిస్తూ అంకితభావంతో ముందుకు వెళ్లాడని కోచ్ మాలిక్ వివరించాడు. ఇప్పుడు యాసిర్ లక్ష్యం ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం. ఒక చిన్న గొడవతో మొదలైన ఈ ప్రయాణం… ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా మారుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>