కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో భవన నిర్మాణ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సమస్యల సాధన కోసం చేపట్టిన సమ్మెకు జనసేన (Janasena) పార్టీ తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో రాత్రింబవళ్లు శ్రమించే సెంట్రింగ్ కార్మికుల కష్టం ఎంతో గొప్పదని, అలాంటి కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ సెంట్రింగ్ కార్మికుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున పోరాడుతుందని శంకర్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు మిరియాల రామకృష్ణ, ఆబోతుల మాధవరావుతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొని కార్మికులకు తమ మద్దతును తెలియజేశారు.

