కలం, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరుకుపాలెం (Cheruvukommupalem)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని నీటి కుంటలోకి ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఈ మేరకు చిన్నారులు కరేటి అభిరామ్ (14), కరేటి సుశాంత్ (12), పొదిలి చిన్ను (11), ఇల్లా దినేష్ (10)లు గల్లంతైనట్లు స్థానికులు గుర్తించారు. గట్టుపై పిల్లల బట్టలు, చెప్పులు లభ్యమవ్వడంతో చిన్నారులు గల్లంతయ్యారని గుర్తించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గజఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి సదరు చిన్నారుల తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి శోకాన్ని చూసి స్థానికులు అక్కడ ఉన్నవారంతా ఎమోషనల్ అవుతున్నారు. దీంతో పరిసర ప్రాంతం అంతా విషాదంతో నిండిపోయింది.

