కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వం మహిళలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోణంలోనే చూస్తోందని భారత జాతీయ మహిళా సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి ధ్వజమెత్తారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో సమాఖ్య జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మహిళా సమాఖ్య సుదీర్ఘ కాలంగా మహిళల అభ్యున్నతికి చేసిన సేవలు, నిర్వర్తించిన బాధ్యతలను గుర్తు చేశారు. నేటి సమాజంలో మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపులు, దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హక్కుల సాధన కోసం మహిళా లోకమంతా ఐక్యంగా ఉండి, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమాఖ్య ప్రతినిధులు పద్మజ, ధనలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

