కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని రూపొందించిన వినూత్న భద్రతా ఆవిష్కరణ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను రక్షించేందుకు రూపొందించిన “స్మార్ట్ వేరబుల్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్” (Smart Airbag Jacket) ప్రాజెక్ట్కు కేంద్ర MSME హ్యాకథాన్ 5.0లో రూ.12 లక్షల గ్రాంట్ లభించింది. కరీంనగర్కు చెందిన బీటెక్ విద్యార్థిని పెర్కారి శ్రీ చందన (Karimnagar Student Sri Chandana) రూపొందించిన “స్మార్ట్ వేరబుల్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ ఫర్ టూ – వీలర్ రైడర్స్” ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. తండ్రి రోడ్డు ప్రమాదం తర్వాత ఈ ఆవిష్కరణకు పూనుకుంది.
అందుబాటులో ధర..
ద్విచక్ర వాహన ప్రమాదాల్లో జరిగే తీవ్ర గాయాలను తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. సెన్సార్లతో కూడిన ప్రత్యేక జాకెట్ రూపంలో రూపొందించిన ఈ వ్యవస్థ, వాహనం నడుపుతున్న సమయంలో వేగం, కదలికలు, సమతుల్యతలో వచ్చే ఆకస్మిక మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రమాదం సంభవించే సూచనలు కనిపించిన వెంటనే, క్షణాల్లోనే ఎయిర్బ్యాగ్ తెరుచుకుని తల, ఛాతీ, వెన్నెముక వంటి కీలక అవయవాలకు రక్షణ కల్పిస్తుంది. దీంతో తీవ్రమైన గాయాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చందన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ నమూనాను సుమారు రూ.3 వేల వ్యయంతో రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. తుది ఉత్పత్తిని రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు.
తండ్రి రోడ్డు ప్రమాదం నుంచే ఆలోచన..
తన తండ్రికి జరిగిన రోడ్డు ప్రమాదం నుంచే ఈ ఆలోచనకు ప్రేరణ లభించిందని చందన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదం జరగక ముందే రక్షణ కల్పించడమే ఈ ఆవిష్కరణ ప్రత్యేకత అని వివరించారు. “రెండు చక్రాల వాహనదారుల భద్రత కోసం అందుబాటు ధరలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనేదే నా లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ ద్వారా అనేక ప్రాణాలను కాపాడగలమని నమ్ముతున్నాను” అని శ్రీ చందన చెబుతున్నారు. యువతలోని సృజనాత్మకతకు ఈ ఆవిష్కరణ నిదర్శనంగా నిలుస్తోంది. రోడ్డు భద్రతకు కొత్త దారులు చూపుతున్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ స్మార్ట్ వేరబుల్ ఎయిర్బ్యాగ్ ఒక ప్రత్యేక జాకెట్ రూపంలో రూపొందించబడింది. ఇందులో అమర్చిన సెన్సర్లు వాహనం వేగం, కదలికలు, సమతుల్యతలో వచ్చే ఆకస్మిక మార్పులను నిరంతరం గమనిస్తాయి. ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నట్లు గుర్తించిన వెంటనే, మిల్లీ సెకన్లలోనే ఎయిర్బ్యాగ్ తెరుచుకుని తల, ఛాతీ, వెన్నెముక వంటి కీలక అవయవాలను రక్షిస్తుంది. దీంతో తీవ్రమైన గాయాల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. కేవలం ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే సాంకేతికతలతో పోలిస్తే, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతగా నిలుస్తోంది. దాదాపు మూడు వేల రూపాయలతో తొలి నమూనాను అభివృద్ధి చేసిన చందనా తుది ఉత్పత్తిని ఐదు నుంచి ఆరు వేల రూపాయల వ్యయంతో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు.
రోడ్డు ప్రమాదాల ప్రభావాన్ని తగ్గించే సాంకేతిక పరిష్కారంగా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ఈ సాంకేతికతను రూపొందించినట్లు ఆమె తెలిపారు. హెల్మెట్ తలను మాత్రమే కవర్ చేస్తుందని, బాడీ పూర్తిగా రక్షణ కోసమే ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు చెప్పారు. బైక్ రైడర్ జాకెట్ వేసుకోవడంతో పాటు వాహనం ఆన్ లో ఉండగా సెన్సార్ పనిచేస్తూ స్పీడ్ ను బట్టి యాక్సిడింట్ సూచనలు తెలుస్తాయని వివరించారు. ఎయిర్ బ్యాగ్ తో తలతో పాటు బాడీకి ఎలాంటి దెబ్బలు తగలవని చెప్పుకొచ్చారు.

