కలం, వెబ్డెస్క్: కేరళ (Kerala) రాష్ట్రంలోని త్రిసూర్ (Thrissur) నగరంలో ఓ గజరాజు (Elephant) బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ఒక్కసారిగా అదుపుతప్పి జనావాసాల్లోకి దూసుకువచ్చి తీవ్ర కలకలం సృష్టించింది. పురాతన ఆలయమైన వడక్కుమ్నాథ్ ఆలయం వద్ద గజరాజు పరుగులు తీసింది. ఇళ్ల గేట్లు, కార్లు, వాహనాలను ధ్వంసం చేసి గాయపడింది.
దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎలిఫెంట్ స్క్వాడ్, అటవీశాఖ సిబ్బంది ఏనుగును అదుపు చేశారు. పండ్లు, చల్లటి నీటిని ఇచ్చి ఏనుగును శాంతింపజేశారు. అనంతరం ఏనుగుకు ప్రథమ చికిత్స చేశారు.

