కలం, వెబ్ డెస్క్: ఆప్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ రాఘవ్ చద్ధాకు (Raghav Chadha) రాజ్యసభలో కీలక పదవి దక్కింది. ఆయన్ను పిటిషన్ల కమిటీకి ఛైర్మన్ గా నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. పది మంది రాజ్యసభ సభ్యులున్న ఈ కమిటీలో రాఘవ్ చద్ధానే పిన్న వయస్కుడు కావడం గమనార్హం. మే 20వ తేదీ నుంచే ఈ కమిటీ అమల్లోకి వచ్చినట్లు రాజ్యసభ నోటిఫికేషన్లో వెల్లడించింది. ఎగువసభలో నమోదయ్యే వివిధ పిటిషన్లను రాఘవ్ చద్ధా ఆధ్వర్యంలోని ఈ కమిటీనే విచారించబోతుంది.
కేంద్ర మంత్రి పదవి ఖాయమేనా..?
మరోవైపు, త్వరలో జరిగే కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో రాఘవ్ చద్ధాకు కేంద్ర మంత్రి పదవి ఖాయమని చర్చ జరుగుతోంది. ఆయనకు కేంద్ర కేబినెట్ పదవే దక్కబోతుందని చెబుతున్నారు. ఆప్ పార్టీని చీల్చి, తన వర్గంతో రాఘవ్ చద్ధా బీజేపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిఫలంగా ఆయనకు కీలక మంత్రిత్వ శాఖ అప్పగించాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం.

