కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న భూదాన్ భూముల కుంభకోణం వ్యవహారంలో ఖమ్మంపై (Khammam) ఈడీ గురి పెట్టిందనే వార్తలొస్తున్నాయి. ఆచార్య వినోబాభావే నాడు పేద ప్రజల సాగు, గూడు కోసం సేకరించిన పవిత్రమైన భూదాన్ భూములను, కొందరు రికార్డుల మాయాజాలంతో ప్రైవేటు శక్తులకు కట్టబెట్టడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు (Amoy Kumar) మే 21న ఈడీ సమన్లు జారీ చేయడం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం భూములపై దర్యాప్తును ముమ్మరం చేయడంతో.. దీని అంతర్గత లింకులు ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల (Bhoodan Lands) వైపు లాగుతున్నాయి. ఒకే రకమైన వ్యూహంతో సాగిన ఈ భూ దోపిడీ వెనుక ఉన్న బడా బాబుల గుట్టు రట్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగం సిద్ధం చేయడంతో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మహేశ్వరంలో కదిలిన డొంక..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన క్రిమినల్ కేసుల ఆధారంగా ఈడీ ప్రస్తుతం తన దర్యాప్తును వేగవంతం చేసింది. అక్కడ సుమారు 42 ఎకరాల అత్యంత విలువైన భూదాన్ భూములను (Bhoodan Lands) నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు బదలాయించారనే ఆరోపణలపై గతంలోనే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను ఈడీ ప్రశ్నించింది. అయితే ఈ వ్యవహారంలో కేవలం మహేశ్వరానికే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన వ్యూహంతో భూములు చేతులు మారాయని ఈడీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈ విచారణ పరిధి విస్తరిస్తే, వెలుగుమట్ల పరిధిలోని సర్వే నంబర్ల ఫైళ్లు కూడా ఈడీ రాడార్లోకి రావడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
వెలుగుమట్లలో రికార్డుల మాయాజాలం..
ఖమ్మం నగరానికి ఆనుకుని ఉండి, నేడు వందల కోట్ల రూపాయల విలువ పలికే వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూములు కొన్నేళ్లుగా వివాదాల సుడిగుండంలో ఉన్నాయి. భూదాన్ బోర్డులోని అసలు రికార్డులను మాయం చేయడం లేదా నిబంధనలను తమకు అనుకూలంగా మార్చేయడం ద్వారా ఇక్కడి భూములను కొల్లగొట్టారనేది ప్రధాన ఆరోపణ. ఉన్నతాధికారులు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రూలింగ్స్ను, వివాదాస్పద కోర్టు ఆర్డర్లను అడ్డం పెట్టుకుని రాత్రికి రాత్రే బినామీల పేరిట రెవెన్యూ రికార్డులను సృష్టించారనే విమర్శలున్నాయి. పేద రైతులు, స్థానికులను దౌర్జన్యంగా ఖాళీ చేయించి, ఆ స్థలాల్లో రాత్రికి రాత్రే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ ప్రాజెక్టులు వెలిసేలా చేశారనే బలమైన ఆరోపణలు వెలుగుమట్ల పరిధిలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.
అమోయ్ కుమార్ వెనుక ఎన్నో రహస్యాలు..
ఈ నెల 25న అమోయ్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యే సందర్భంగా మూడు ముఖ్యమైన సేల్ డీడ్ పత్రాల సంపూర్ణ వివరాలతో హాజరుకావాలని ఆదేశించడం వెనుక పెద్ద రహస్యమే దాగుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూడు పత్రాల్లో ఒకదానికి ఖమ్మం జిల్లా పరిధిలోని ఒక బడా లావాదేవీతో అంతర్గత సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సదరు ఉన్నతాధికారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన కాలంలోనే, ఖమ్మంకు చెందిన కొందరు బడా రాజకీయ నేతలు, రియల్టర్లు అక్కడ పెద్ద ఎత్తున భూదందాలు సాగించారు. దానికి ప్రతిఫలంగా వెలుగుమట్ల పరిధిలోని కొన్ని వివాదాస్పద భూముల్లో బినామీ పెట్టుబడులు చేతులు మారాయనే ఘాటైన చర్చ సాగుతోంది. ఈడీ గనుక ఈ మనీ లాండరింగ్ మూలాలను గట్టిగా లాగితే ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కూడా బోనులో నిలబడక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఖమ్మంలో మొదలైన కలవరం..
హైదరాబాద్ వేదికగా ఈడీ తన పట్టును బిగించడంతో ఖమ్మంలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లోనూ గుసగుసలు మొదలయ్యాయి. వెలుగుమట్ల పరిధిలో గతంలో వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్ల ఫైళ్లు, కోర్టు ఆదేశాల పేరిట ఇచ్చిన మ్యుటేషన్ల రికార్డులను కొందరు అధికారులు రహస్యంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈడీ దర్యాప్తు పరిధి కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాదని, ‘భూదాన్’ పేరుతో ఎక్కడెక్కడ మనీ లాండరింగ్ జరిగిందో వాటన్నింటినీ లాగుతామని స్పష్టం చేయడంతో వెలుగుమట్ల భూబకాసురుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
భూదాన్ పోరాటయోధుల హర్షం..
భూదాన్ భూముల పరిరక్షణ కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న హక్కుల సంఘాలు, బాధితులు ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడాన్ని స్వాగతిస్తున్నారు. మహేశ్వరం భూములను తవ్వితే వెలుగుమట్ల అక్రమాలు బయటపడతాయని వారు నమ్ముతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ కేసులో కేవలం అధికారులనే కాకుండా, వారి వెనుక ఉండి నడిపించిన అసలు సూత్రధారులను, రాజకీయ పెద్దలను టార్గెట్ చేస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఈ నెల 25న జరగబోయే విచారణ తర్వాత వెలువడే మరిన్ని నిజాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వర్గాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో వేచి చూడాలి.
Read Also : గుడ్ న్యూస్.. మహిళలకు వడ్డీలేని రుణాలు భారీగా పెంపు..!
Follow Us On : WhatsApp

