కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సూచించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో డీజీపీ పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద వీఐడీఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ)కు సంబంధించిన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పిల్లలకు కూడా హెల్మెట్ ధరింపజేసి చేసి ప్రయాణించాలని, జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని, వాహనానికి, వాహనానికి మధ్య డిస్టెన్స్ పాటించాలని సూచించారు. వేగంగా డ్రైవింగ్ చేయొద్దని, మనపై ఆధారపడ్డవారికి కన్నీరు మిగిల్చరాదన్నారు. అలాగే సీటు బెల్టు తప్పనిసరి ధరించాలని జాగ్రత్తలు చెప్పారు.
అనంతరం గ్రామప్రజలతో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. వీఐడీఎస్ సంబంధించిన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను డీజీపీ (DGP Shivadhar Reddy) ప్రారంభించారు. ఇది మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షించడానికి, AI విశ్లేషణలతో కూడిన హై-డెఫినిషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి, నిజామాబాద్ ఇన్చార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఆర్మూర్ ఏసీపీ వెంకటరెడ్డి, డిచ్ పల్లి సీఐ కె.వినోద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ , డిచ్ పల్లి ఎస్ఐ ఆరీఫ్, ఇందల్వాయి ఎస్ఐ జి.సందీప్, ఈ-డార్ మేనేజర్ వర్ష, ప్రాజెక్ట్ మేనేజర్ వంశీధర్, టోల్ ప్లాజా మేనేజర్ వీరబాలు, గ్రామ సర్పంచ్ రఘు, ప్రజలు పాల్గొన్నారు.
Read Also: అసలైన నిద్ర రహస్యం అదే.. ఆలియా భట్ ప్రశ్నకు సద్గురు సమాధానం!
Follow Us On: Instagram

