కలం, వెబ్ డెస్క్: గడ్డి పొడవుపై బార్సిలోనా హెడ్కోచ్ ఇచ్చిన ఫిర్యాదుపై యూఈఎఫ్ఏ (UEFA) స్పందించింది. ఈ గడ్డి వివాదానికి తెరదించింది. యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్స్ ఫైనల్స్ రెండో లెగ్ మ్యాచ్కు ముందు ఈ గడ్డి వివాదం కీలక చర్చలకు దారితీసింది. ఈ మ్యాచ్కు ముందు రియాద్ ఎయిర్ మెట్రోపాలిటానో స్టేడియం పిచ్ పరిస్థితి, అక్కడి గడ్డి మరీ పొడవు ఉండటంపై ఫ్లిక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన ఫిర్యాదు కూడా చేశారు. ఆయన ఫిర్యాదుపై వెంటనే యూఈఎఫ్ఏ స్పందించడంతో ఈవివాదం ఒక కొలిక్కి వచ్చింది. హాన్సీ ఫ్లిక్ లేవనెత్తిన అభ్యంతరాలపై యూఈఎఫ్ఏ (UEFA) నేరుగా స్పందిస్తూ కీలక చర్యలు చేపట్టింది. మెట్రోపాలిటానో స్టేడియంలో గడ్డి పొడవు ఎక్కువగా ఉందంటూ ఫ్లిక్ గత కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిచ్ తనిఖీ సమయంలో ఆయన చాలా అసహనంగా కనిపించడమే కాకుండా, అధికారికంగా యూఈఎఫ్ఏ ప్రతినిధులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న యూఈఎఫ్ఏ, ఇరు క్లబ్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశంలో మైదానంలోని గడ్డి పొడవును 26 మిల్లీమీటర్ల వద్దే ఉంచుతామని యూఈఎఫ్ఏ హామీ ఇచ్చింది. నిబంధనల ప్రకారం గరిష్ట పరిమితి 30 మిమీ ఉన్నప్పటికీ, ఫ్లిక్ అభ్యర్థన మేరకు దానిని తగ్గించాలని నిర్ణయించింది. ఒకవేళ ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే వెంటనే కొలతలు తీసుకుని సరిచేస్తామని అధికారులు స్పష్టం చేశారు. కేవలం గడ్డిని కత్తిరించడమే కాకుండా, బంతి వేగంగా కదలడానికి వీలుగా మ్యాచ్ ప్రారంభానికి ముందు, అలాగే హాఫ్ టైమ్ సమయంలో మైదానాన్ని తడిపి సిద్ధం చేయాలని నిర్ణయించారు. బార్సిలోనా జట్టు వేగవంతమైన పాసింగ్ గేమ్కు ఇది ఎంతో కీలకం కానుంది. తమకు అనుకూలమైన పరిస్థితులు లభించడంతో ఇప్పుడు బార్సిలోనా శిబిరంలో ఆందోళన తగ్గింది. పిచ్ సమస్య పరిష్కారం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆటపైనే నెలకొంది. మైదానం సిద్ధమైంది, నిబంధనలు ఖరారయ్యాయి. ఇక ఆటగాళ్లు మైదానంలో తమ ప్రతిభను ఎలా చాటుతారో వేచి చూడాలి.
Read Also: లేటెస్ట్ సెన్సస్ ప్రాతిపదికగా డీలిమిటేషన్
Follow Us On: Instagram

