కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, రక్షిత మంచినీటి సరఫరా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా సురక్షిత తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
అమీన్ పూర్ డివిజన్లోని టైలర్స్ కాలనీలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ ప్రాంతంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మరింత బలోపేతం చేయడానికి నూతన పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

