కలం, చిట్యాల: రసాయన పరిశ్రమల్లో తరుచు జరుగుతున్న పేలుళ్లు సాధారణ ప్రమాదాలు కావని, అవి యాజమాన్యాల నిర్లక్ష్యం, కొరవడిన అధికారుల అలసత్వం కలిసి చేస్తున్న కార్మికుల హత్యలని సీపీఐ జాతీయ నేత డా. కె. నారాయణ (CPI Narayana) తీవ్రంగా మండిపడ్డారు. చిట్యాల మండలం బొంగొని చెరువు పరిధిలోని నోష్ ఫార్మా పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన స్థలాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఒకే పరిశ్రమలో 20 రోజుల వ్యవధి కాలంలోనే మళ్లీ పేలుడు (Chemical Plant Blasts) జరగడం యాజమాన్య నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనమని ఆరోపించారు. రసాయన పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రతా పరికరాలు ఇవ్వకుండా ప్రమాదకర పనులు చేయించడం అమానుషమన్నారు. ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులకు సేఫ్టీ పరికరాలు లేవని యాజమాన్యం చెప్పడం సిగ్గుచేటు అని తీవ్రంగా విమర్శించారు.
డబ్బులు ఖర్చవుతాయని నిబంధనలు పక్కనబెట్టి, లాభాల కోసం మానవ ప్రాణాలను త్యాగం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల ప్రాణాలు చౌకగా మారాయి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఫార్మా, రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పూర్తిగా విస్మరించబడుతున్నాయని, సంబంధిత అధికారులు కళ్లెదుటే జరుగుతున్న నిర్లక్ష్యాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో బాలకృష్ణ మృతి చెందడం, మరికొందరు గాయపడడం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి రూ.1 కోటి, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్న నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ను తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కార్మికుల ప్రాణ భద్రతను కాపాడటం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని, ఇందులో విఫలమైతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని డా. నారాయణ హెచ్చరించారు.

