కలం, సూర్యాపేట బ్యూరో: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ (Suryapet Agricultural Market Yard)లో రైతుల కోసం రూ.5కే భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ (Collector Tejas Nandlal) తెలిపారు. హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ సౌజన్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.5 అన్నపూర్ణ భోజనాన్ని కలెక్టర్ ప్రారంభించి రైతులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దూరం నుంచి పంటను అమ్ముకునేందుకు వస్తున్న రైతులకు మంచి క్వాలిటీ భోజనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్నం, కూర, పప్పు, పచ్చడితో రైతులకు నాణ్యత భోజనం ఏర్పాటు చేశామని, సీజన్ సమయంలో భోజనంతో పాటు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టిఫిన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మరోవైపు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్లలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ (Collector Tejas Nandlal) ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా రూ.2,400 మద్దతు ధర కల్పిస్తుందని, మార్కెట్లలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో పంటను అమ్మి మద్దతు ధర పొందాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు ధాన్యం రాకుండా బార్డర్ చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. పోలీస్, సివిల్ సప్లయ్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పని చేస్తూ బయట నుంచి ధాన్యం రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.
Read : రొనాల్డో 969వ గోల్.. సెమీస్లోకి దూసుకెళ్లిన అల్-నసర్
Follow Us On: X(Twitter)

