కలం, వెబ్ డెస్క్ : స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, దేశీయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సూచించారు. సోమవారం ఏలూరు జిల్లాలోని కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో కలిసి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పాప్కార్న్ మెయిజ్ సీడ్ను ఆవిష్కరించి ప్రసంగించారు.
భవిష్యత్తులో పాప్కార్న్ అంటే ముసునూరు గుర్తొచ్చేలా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. భవిష్యత్తులో స్టార్టప్లు, ఆవిష్కరణలదే ప్రముఖ పాత్ర అని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంతాన్ని భవిష్యత్తులో హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
వ్యవసాయం, ఉద్యానవన పంటల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి రైతులకు మరింత ఆదాయం వచ్చేలా చర్యలు చేపడతామని చంద్రబాబు వెల్లడించారు. అనకాపల్లి ప్రాంతానికి పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని అందించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

