కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండలం మాదాపూర్ గ్రామంలో (Madapur Village) నివసిస్తున్న చెంచు, బీసీ కులస్తులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరుతూ గ్రామస్థులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మాదాపూర్ గ్రామంలో చెంచు కులస్తులు నివసిస్తున్నప్పటికీ పక్కా గృహాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
చెంచు కులస్తులతో పాటు బీసీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలు కూడా గ్రామంలో నివసిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను కేటాయించి, అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సదుపాయం కల్పించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

