కలం, పెద్దపల్లి: పదకొండు రోజుల క్రితం మంథని (Manthani) పట్టణంలోని బొక్కలవాగులో మునిగిపోయిన బాలికను రక్షించిన యువకుల సాహసం స్పూర్తిదాయకమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో బోయిన్పేటకు చెందిన అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్ అనే ఇద్దరు యువకులను శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బోయిన్పేటకు చెందిన పర్శవేన రాజు యాదవ్ అలియాస్ ఆర్కే యాదవ్.. గొర్లను మేపుకొంటూ బొక్కలవాగు దాటే క్రమంలో వాగులో మునిగిపోయాడని, నీటిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడేందుకు ప్రయత్నం చేసిన ఆయన కూతురు సైతం నీటిలో మునిగిపోయిందని తెలిపారు. నీటిలో మునిగిపోతూ కేకలు వేయడంతో సమీపంలోని గోదాంలో పనికి వెళ్తున్న అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్లు బాలిక కేకలు విని ఆలస్యం చేయకుండా వాగులోకి దూకి తమ ప్రాణాలు లెక్క చేయకుండా బాలిక ప్రాణాలు కాపాడారని తెలిపారు.
బాలికను రక్షించేందుకు ఇద్దరు యువకులు అత్యంత సాహాసం చేశారని ఆయన కొనియాడారు. ఈనాడు యువత చెడు మార్గాల వైపు పయనిస్తుంటే ఇద్దరు యువకులు మాత్రం గొప్ప సాహసం చేసి నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఈత నేర్చుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ఈత ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని ఆయన తెలిపారు. అనంతరం సాహసం చేసిన యువకులతో కలిసి అల్పాహారం స్వీకరించారు.

