కలం, నిర్మల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రజావాణి (Nirmal Prajavani) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొందరు జిల్లాధికారుల తీరుతో ఈ కార్యక్రమం అభాసుపాలవుతోంది. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కొందరు అధికారులు తమ బాధ్యతలను పక్కనపెట్టారు. మొబైల్ ఫోన్లలో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎంతో దూరం నుంచి కలెక్టర్ కార్యాలయానికి వస్తుంటే, అధికారులు మాత్రం మొబైల్ ఫోన్లలో నిమగ్నమై కనిపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరికొందరు అధికారులు ఫోన్లలో మాట్లాడుతూ కనిపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఫిర్యాదుదారుల సమస్యలను పూర్తిగా విస్మరించారు. ప్రజావాణిలో మొబైల్ ఫోన్లలో రీల్స్ (Reels) చూడటం, వ్యక్తిగత సంభాషణల్లో నిమగ్నం కావడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

