కలం, వనపర్తి: వనపర్తి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ చిన్నమ్మ థామస్ (Chinnamma Thomas) తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాల ముప్పులో ఉన్న కుటుంబాలను ప్రభుత్వ పథకాలతో అనుసంధానించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాగే, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ నేతృత్వంలో కొనసాగుతున్న ఉద్యమానికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు.
ఉద్యమ వ్యవస్థాపకుడు భువన్ రిభు, సియెర్రా లియోన్ ఆధ్వర్యంలో భారత్ సహా సుమారు 67 దేశాల మద్దతుతో నవంబరు 27ను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ఐరాసకు తీర్మానం సమర్పించామని చిన్నమ్మ థామస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆమోదం లభించిందన్నారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 782 జిల్లాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసి, ఇప్పటివరకు 5.50 లక్షలకు పైగా బాల్య వివాహాలు ఆగిపోయేలా చేశామని గుర్తు చేశారు.

