కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 40 శాతం వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ (Sunke Ravi Shankar) అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. వరి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలు, తూకాల్లో మోసాలను అరికట్టి, తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉందన్నారు. మట్టి తరలింపుపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోళ్లపై పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యపు సంచులకు చెదలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రవిశంకర్ (Sunke Ravi Shankar) మండిపడ్డారు. ప్రతి క్వింటాల్ వడ్లకు ఏకంగా 10 కిలోల వరకు తరుగు పేరిట కట్ చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ‘ఏ’ గ్రేడ్గా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం ఇప్పుడు ‘బి’ గ్రేడ్గా మారుస్తూ క్వింటాల్కు రూ.20 వరకు తగ్గిస్తున్నారన్నారు. అదనంగా ‘తాలు’ నెపంతో వడ్లను నిలువునా దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, హమాలీల కొరత తీవ్రంగా ఉందన్నారు. లారీ యజమానులు ప్రతి బస్తాకు రెండు రూపాయల చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఈ ప్రాంతంలో దాదాపు 60 శాతం వరిధాన్యం ఇంకా కేంద్రాల్లోనే మూలుగుతోందని, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మట్టి తరలింపు లారీలను నిలిపివేసి, ఆ లారీలను ధాన్యం రవాణాకు మళ్లించి, యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలని రవిశంకర్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా
Follow Us On: Sharechat

