కలం, నిర్మల్ : ఈనెల 7న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న అన్నారు. శనివారం జేఏసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాయకత్వం డాక్టర్ విశారదన్ మహరాజ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం (JAC Protest) చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సమస్యలపై జరిగే ఈ ధర్నాకు అన్ని పార్టీలకు చెందిన ఆయా సామాజిక వర్గాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు రామగిరి రవీందర్, గొడుగు గంగాధర్, ముద్రబోయిన వినేష్, సుంకరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

