కలం, వెబ్ డెస్క్ : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న మరణ వార్తలు కేవలం అవాస్తవాలని, ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని హన్మకొండలోని రోహిణి ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. చికిత్సకు సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సానుకూలంగా స్పందిస్తున్నారని, చికిత్స అందిస్తున్న సమయంలో ఆయన హార్ట్ బీట్ తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని వైద్య బృందం పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం ఆయనకు సీటీ స్కాన్ తో పాటు ఇతర వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ, లంగ్స్ కి సంబంధించిన కొంత ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరింత మెరుగైన, నిపుణులైన వైద్య సహాయం అందించడం కోసం హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రమాదం నుండి బయటపడ్డారని, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.

