కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ పాలన తీరుపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ఆయన బీజేపీ 3సీ ఇన్ఫ్లేషన్గా అభివర్ణించారు. బీజేపీ మార్క్ కమిషన్, అవినీతి, కోవిడ్ తర్వాతి ద్రవ్యోల్బణం వల్లే సామాన్య ప్రజలపై ఈ మోయలేని భారం పడిందని మండిపడ్డారు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న దేశ ప్రజలకు, కేంద్ర ప్రభుత్వ విధానాలు ‘ద్రవ్యోల్బణం మూడో డోస్’ ఇచ్చినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇదే క్రమంలో ద్రవ్యోల్బణం ఎంత పెరిగినా తాము బీజేపీకే ఓటు వేస్తామంటూ గుడ్డిగా సమర్థించే ఆ పార్టీ మద్దతుదారులపై అఖిలేష్ యాదవ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ధరలు ఎంత పెరిగినా మద్దతు ఇస్తామంటున్న ఆ శ్రేణులకు ఈ ద్రవ్యోల్బణం పెరిగినందుకు ‘అభినందనలు’ అంటూ సెటైర్లు వేశారు. బీజేపీ ప్రభుత్వం ఇకనైనా వారి పార్టీ సభ్యత్వ కార్డులను చూసి, పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, రవాణా ఛార్జీల భారాన్ని కేవలం ఆ మద్దతుదారులపైనే వేయాలని, ఆ ధరలకే వారికే సరుకులను అమ్ముకోవాలని సూచించారు. అలా చేస్తూ కనీసం మిగిలిన సామాన్య ప్రజలపై, పేదలపై కాస్తయినా కరుణ చూపి, వారిని ఈ ధరల భారం నుండి మినహాయించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అఖిలేశ్ యాదవ్ ఎడ్లబండిపై ప్రయాణించి ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

