కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల (Jagtial) వ్యవసాయ మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యం రైతన్నలను వర్షం భయంతో గజగజ వణికిస్తోంది. గోదాములన్నీ నిండాయని చెప్పి కొత్తగా వచ్చిన వరి ధాన్యాన్ని ఆరుబయటే కుప్పలుగా పోశారు. అదే మార్కెట్లో సమీకృత మార్కెట్ షెడ్లు మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే, రైతు పంటకు దిక్కులేదు కానీ ఆ ఖాళీ షెడ్లను ప్రైవేట్ సిమెంట్ కాంట్రాక్టర్కు నెలవారీ అద్దెకు ఇచ్చేశారని సమాచారం. “ధాన్యం వర్షానికి తడిసిపోతుంటే అధికారులు సిమెంట్ బస్తాలకు రాచమర్యాదలు చేస్తున్నారు. మార్కెట్ రైతు కోసమా, వ్యాపారుల కోసమా?” అంటూ అన్నదాతలు నిలదీస్తున్నారు.
వర్ష భయం..
ప్రస్తుతం జిల్లాలో వాతావరణం మారింది. ఎప్పుడైనా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. బయట ఉన్న ధాన్యం 2-3 గంటలు తడిస్తే చాలు తేమ 17% దాటుతుంది. అంతే, ప్రభుత్వం కొనదు. మిల్లర్లు అదును చూసి క్వింటాలుకు రూ. 400 వరకు కోత కోస్తారు. వారం తడిస్తే మొలకలొచ్చి, ఫంగస్ పట్టి పశువులకు కూడా పనికిరాకుండా పోతుందని రైతులు కన్నీరు పెడుతున్నారు.
చట్టం ఏం చెబుతోంది?
మార్కెట్ చట్టం ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో రైతు పంటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇక్కడ చట్టాన్ని తుంగలో తొక్కి, ఆదాయం కోసం షెడ్లను ప్రైవేటుకు కట్టబెట్టారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

