కలం, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో మరో ప్రభుత్వ అధికారి అవినీతి బాగోతం బట్టబయలైంది. ల్యాండ్స్ అండ్ సర్వే మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిను (Sunkari Narahari) ఏసీబీ అధికారులు అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ చేశారు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టరానే ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్ ఛత్రినాకలోని నరహరి నివాసంతో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో సోదాలు (ACB Raid) చేపట్టారు. మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ క్రమంలో నరహరి భారీ అవినీతి చిట్టా వెలుగులోకి వచ్చింది. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో నరహరిపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇంట్లో రూ. 1.54 కోట్ల నగదు
మంగళవారం ఉదయం నుంచే ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ (DSP Sridhar) ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు నరహరి నివాసంలో సోదాలు (ACB Raid) చేపట్టారు. ఈ క్రమంలో నరహరి ఇంట్లో రూ. 1.54 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఈ నగదును నరహరి బెడ్ రూమ్, బీరువా పైన కప్బోర్డుల్లో లభించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. నరహరి నివాసంలో ఇంత భారీ మొత్తంలో నగదును చూసి ఏసీబీ అధికారులు షాక్కు గురయ్యారు.
బ్యాంక్ ఖాతాల్లో రూ.2.29 కోట్లు, ఎఫ్డీలు రూ. 5.04 కోట్లు
అంతేకాకుండా నరహరి బ్యాంక్ ఖాతాల్లో రూ.2.29 కోట్లు, బ్యాంక్ డిపాజిట్లు (ఎఫ్డీ)లు రూ. 5.04 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నరహరి భార్య పేరు మీద రెండు బ్యాంక్ లాకార్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిని తనిఖీ చేసేందుకు అనుమతి కోసం బ్యాంకుకు లేఖ రాశామన్నారు. రెండు మూడు రోజుల్లో ఆ లాకర్లు ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. సోదాల సమయంలో భారీగా బంగారు, వెండి ఆభరణాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అవినీతి చిట్టా 100 కోట్లు
రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్స్ , మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పలగూడలో ఒక హై రైజ్ బిల్డింగ్, నార్సింగి, రాజేంద్రనగర్లో రెండు రెసిడెన్సియల్ ఫ్లాట్స్లకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. వీటితో పాటు టీఎన్జీఓ కాలనీలో ఒక జీ + 3 బిల్డింగ్, ఛత్రినాకలో జీ + 2 బిల్డింగ్, కీయా సంస్థకు చెందిన కారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నరహరి నివాసంలో ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.13.05 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో మాత్రం ఈ ఆస్తులు విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించారు.

