Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్ క్లాసిక్‌లో కోచర్, కార్తిక్ జోరు.. టైటిల్ రేసులోనే

కలం, స్పోర్ట్స్​ : భారత్ క్లాసిక్ గోల్ఫ్ టోర్నీ (India Classic Golf Tournament) లో భారత ఆటగాళ్లు కరందీప్ కోచర్, కార్తిక్ సింగ్ టైటిల్ పోరులో తమ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నారు. మొరాకోలోని మజగాన్ బీచ్ అండ్ గోల్ఫ్ రిసార్ట్‌లో గాలులు బలంగా వీచిన కఠిన పరిస్థితుల్లోనూ ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి కరందీప్ కోచర్ మొత్తం ఐదు అండర్ పార్ స్కోరుతో ఐదో స్థానాన్ని పంచుకున్నాడు. తొలి రౌండ్‌లో 66 స్కోరు చేసిన కోచర్, రెండో రౌండ్‌లో ఒక ఓవర్ 73 నమోదు చేశాడు. ఆసియన్ టూర్‌లో ఇప్పటికే ఆరు టాప్-5 ఫినిష్‌లు సాధించిన అతడు, ఈసారి తొలి టైటిల్‌పై దృష్టి పెట్టాడు.

యువ గోల్ఫర్ కార్తిక్ సింగ్ కూడా ఆకట్టుకున్నాడు. తొలి రౌండ్‌లో 70 స్కోరు చేసిన అతడు, రెండో రౌండ్‌లో 69తో మెరుగైన ప్రదర్శన చేసి ఐదు అండర్ పార్‌తో కోచర్ సరసన నిలిచాడు. టోర్నీ లీడర్‌బోర్డ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సెట్టి ప్రకోంగ్‌వెచ్, రుంచనపోంగ్ యూప్రయోంగ్ సంయుక్త ఆధిక్యంలో ఉన్నారు. ఇద్దరూ తొమ్మిది అండర్ పార్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రకోంగ్‌వెచ్ బోగీ లేకుండా ఏడు అండర్ 65 స్కోరు చేయగా, తొలి రోజు లీడర్‌గా నిలిచిన రుంచనపోంగ్ రెండో రౌండ్‌లో 70 నమోదు చేశాడు. ఆస్ట్రియాకు చెందిన నిక్లాస్ రెగ్నర్, థాయ్‌లాండ్ ఆటగాడు ఎక్‌ఫారిట్ వూ ఆరు అండర్ పార్‌తో మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు.

కోచర్ తన రౌండ్‌ను 10వ హోల్ నుంచి ప్రారంభించాడు. మొదటి 12 హోల్స్‌లో ఒక అండర్‌లో కొనసాగిన అతడు, చివర్లో కీలక బర్డీలతో టాప్ ప్లేస్‌లకు దగ్గరగా నిలిచాడు. చివరి హోల్‌లో చిన్న పట్ మిస్ కావడం కొంత నిరాశ కలిగించినా, మొత్తం ఆటపై తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. గత కొన్ని రోజులుగా పుట్టింగ్‌పై ఎక్కువగా పని చేసినందున ఆ విభాగంలో మంచి మెరుగుదల కనిపించిందని పేర్కొన్నాడు.

ఇతర భారత ఆటగాళ్లలో జై బహల్, యశస్ చంద్ర ఒక్క అండర్ పార్‌తో నిలిచారు. శౌర్య భట్టాచార్య, రాఘవ్ చుగ్ ఈవెన్ పార్‌తో 40వ స్థానంలో ఉన్నారు. అనుభవజ్ఞులు గగన్‌జీత్ భుల్లర్, పుఖ్‌రాజ్ సింగ్ గిల్, రషీద్ ఖాన్ 49వ స్థానాన్ని పంచుకున్నారు. ఉదయన్ మానే, సచిన్ బైసోయా, అమన్ రాజ్ 61వ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే, వరుసగా ఐదు టోర్నీల్లో కట్ మిస్ చేసిన ప్రకోంగ్‌వెచ్ ఈసారి అద్భుతంగా పుంజుకున్నాడు. ఏడు బర్డీలతో మెరిసి అగ్రస్థానంలోకి చేరాడు.

మొరాకోకు చెందిన అయూబ్ ల్‌గుయిరాటి నాలుగు అండర్ పార్‌తో స్వదేశీ ఆటగాళ్లలో అత్యుత్తమ స్థానంలో నిలిచాడు. అయితే భారత ఆటగాళ్లు ఎస్‌ఎస్‌పీ చౌరాసియా, మిలింద్ సోని, ఎం. ధర్మ ఒక్క షాట్ తేడాతో కట్ మిస్ చేశారు. వరుణ్ పారిఖ్, ఆర్యన్ రూపా ఆనంద్ రెండు షాట్ల తేడాతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించలేకపోయారు. ఆసియన్ టూర్ మొరాకో సిరీస్‌లో భాగంగా జరుగుతున్న భారత్ క్లాసిక్‌లో చివరి రౌండ్లు మరింత ఉత్కంఠభరితంగా సాగనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>