కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ (Nizamabad) జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో పక్షుల పరిశీలన, చిత్తడి నేలలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలీ సాగర్ చెరువు, సిర్నాపల్లిలోని జానకిబాయి చెరువు, మంచిప్ప బీట్, తిమ్మాపూర్ ట్యాంక్, ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్, భీమ్నగర్ బీట్, బొడ్డు మామిడి చెరువులో పక్షులను పరిశీలించారు. అలీ సాగర్ లేక్ వద్ద జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి, ఎఫ్డీఓ నిజామాబాద్, ఎఫ్ఆర్వో నిజామాబాద్ నార్త్, అటవీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు.
నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలో మొత్తం 118 మంది సభ్యులు పాల్గొన్నారు. చిత్తడి నేలలు, పక్షులు, వన్యప్రాణుల ఆవాసాల ప్రాముఖ్యతను జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను అటవీ అధికారులు వివరించారు. పక్షులను బాధ్యతాయుతంగా గమనించాలని, వన్యప్రాణులకు ఆటంకాలు కలిగించకుండా ఉండాలని, జలాశయాలను ప్లాస్టిక్ కాలుష్యం లేకుండా ఉంచాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి మాట్లాడుతూ.. చిత్తడి నేలలు, స్థానిక చెరువులు కేవలం నీటి వనరులు మాత్రమే కాకుండా, పక్షులు, జలచరాలు వన్యప్రాణులకు ముఖ్యమైన ఆవాసాలని పేర్కొన్నారు. అడవులు, చిత్తడి నేలలు జీవవైవిధ్య పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ ప్రాంతాలలో పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ అటవీ శాఖ, పౌరులు, విద్యార్థులు స్థానిక సమాజాలను ప్రకృతి పరిరక్షణతో అనుసంధానించడానికి ఇటువంటి ప్రకృతి ఆధారిత అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు.

