కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతులను భారత దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్ నాయకత్వానికే దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మలేషియా కౌలాలంపూర్ నగరంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. MATDARE కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వేడుకలకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులకు ఉచితంగా 24 గంటలపాటు కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు.
ప్రతి గడపకూ నల్లా పెట్టి.. ఇంటింటికీ నీళ్లిచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. కరెంట్ కోతలతో అల్లాడిన చోటే, కరెంట్ కోతలంటే తెలియని పరిస్థితిని బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిందన్నారు. ఫ్లోరోసిస్ మహమ్మారిని నల్లగొండ జిల్లా నుంచి తరిమికొట్టామని ఆయన చెప్పుకోచ్చారు. తెలంగాణలోని 70 లక్షల మంది రైతు కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపి వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎల్. రమణ, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గాదరి కిషోర్ కుమార్, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల, బీఆర్ఎస్ నాయకులు గ్యాదరి బాలమల్లు ఇతర నాయకులు హాజరయ్యారు.

