కలం, వెబ్ డెస్క్: విజయవాడలో (Vijayawada) 100 అడుగుల రోడ్డులో నిన్న రాత్రి జీపులతో ఢీకొట్టుకుంటూ హల్చల్ చేసిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోహిత్, ఓమ్, వాళ్ల స్నేహితులను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. అంతేగాకుండా ఘర్షణకు ఉపయోగించిన థార్ జీపులను కూడా సీజ్ చేశారు. వీరిపై పబ్లిక్ న్యూసెన్స్, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
రోహిత్, ఓమ్ మధ్య ఓ యువతి గురించి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి విజయవాడలో 100 అడుగుల రోడ్డులో థార్ జీపులతో దూసుకొచ్చారు. నడిరోడ్డుపై రాడ్లతో జీపుల అద్దాలు పగలగొట్టుకుంటూ బీభత్సం రేపడంతో స్థానికులు భయంతో పరుగులు దీశారు. వెంటనే ఓమ్ అనే యువకుడిని పోలీసులు నిన్ననే అదుపులోకి తీసుకోగా.. రోహిత్ను ఈ రోజు పట్టుకుని విచారిస్తున్నారు. ఈ హైడ్రామా జరుగుతున్న సమయంలో సదరు యువతి ఓ కారులో అక్కడే ఉండి చూస్తుండటం గమనార్హం.

