కలం, వెబ్ డెస్క్: యోగాసన చరిత్రలో కొత్త అధ్యాయం నేటి నుంచి మొదలుకానుంది. ప్రపంచంలోనే తొలి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ (World Yogasana Championship) ప్రారంభమవుతోంది. ఈ ఛాంపియన్షిప్ 2026 జూన్ 4 నుంచి 8 వరకు అహ్మదాబాద్లోని ఈకేఏ అరేనాలో జరగనుంది. ఈ చారిత్రాత్మక టోర్నీలో 60కి పైగా దేశాల నుంచి 400 మందికిపైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. అమెరికా, ఘనా, కెన్యా, మలేషియా, శ్రీలంక, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల క్రీడాకారులు ఒకే వేదికపై పోటీపడనున్నారు. యోగాసనను ప్రపంచ స్థాయి పోటీ క్రీడగా మరింత ముందుకు తీసుకెళ్లే కీలక ఘట్టంగా ఈ ఛాంపియన్షిప్ నిలవనుంది. ఒలింపిక్ గుర్తింపు దిశగా కూడా ఇది మరో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
ఈ టోర్నీకి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గుజరాత్, గుజరాత్ టూరిజం, గుజరాత్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ మద్దతు అందిస్తున్నాయి. ఆతిథ్య దేశమైన భారత్ 122 మంది సభ్యులతో బరిలోకి దిగుతోంది. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, సీనియర్-ఏ, సీనియర్-బీ, సీనియర్-సీ విభాగాల్లో 10 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల అథ్లెట్లు పోటీ పడనున్నారు.
రాబోయే ఐదు రోజుల పాటు వ్యక్తిగత, ఆర్టిస్టిక్, సంప్రదాయ గ్రూప్ ఈవెంట్లు జరగనున్నాయి. ప్రపంచ స్థాయిలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ స్కోరింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీంతో మార్కుల కేటాయింపులో పారదర్శకత, ఖచ్చితత్వం పెరగనుంది. ఈ మెగా ఈవెంట్కు 32 మంది అంతర్జాతీయ న్యాయనిర్ణేతలు, 51 మంది జాతీయ న్యాయనిర్ణేతలు హాజరవుతున్నారు. పోటీ క్రీడగా యోగాసన ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
60కి పైగా దేశాల పాల్గొనడం యోగాసనకు లభిస్తున్న అంతర్జాతీయ ఆదరణను చూపిస్తోందని యోగాసన భారత్ అధ్యక్షుడు ఉదిత్ షెత్ పేర్కొన్నట్లు సమాచారం. భారత జట్టుకు ఇది గొప్ప అవకాశం అని ఆయన తెలిపారు. ప్రపంచ యోగాసన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జైదీప్ ఆర్య మాట్లాడుతూ, ఇది కేవలం టోర్నీ మాత్రమే కాదని, యోగాసనను ప్రపంచ క్రీడగా నిలబెట్టే కీలక ఘట్టమని వివరించినట్లు తెలిపారు.
టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ మల్పానీ కూడా యోగాసన కోసం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న కృషికి ఈ ఛాంపియన్షిప్ ఫలితమని పేర్కొన్నట్లు సమాచారం. ప్రపంచ క్రీడా వేదికపై యోగాసనకు మరింత గుర్తింపు తీసుకురావడంలో ఈ టోర్నీ కీలకంగా మారనుంది.

