లోక్‌సభలో నెంబర్​ గేమ్​.. మహిళా బిల్లు ఆమోదంపై ఉత్కంఠ!

కలం, వెబ్ డెస్క్ : మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)పై మరికొన్ని నిమిషాల్లో ఓటింగ్ జరగనుండడంతో లోక్‌సభ ఆమోదం పొందడంపై ఉత్కంఠ నెలకొన్నది. రాజ్యంగ సవరణ బిల్లు కావడంతో మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో ఈ బిల్లు నెగ్గడానికి 360 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బలం 293 దగ్గరే ఆగిపోవడంతో బిల్లు పాస్ కావడం అనుమానమేననే ఆందోళన అధికార పార్టీలో మొదలైంది. దీంతో బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు విపక్ష పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాల్సిందిగా విపక్ష ఎంపీలకు ప్రధాని మోడీ (Narendra Modi) ఎమోషనల్ అప్పీల్ చేశారు. ఈ అప్పీల్, సంప్రదింపులు ఏ మేరకు ఫలిస్తాయో సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత తేలనున్నది.

అధికార, విపక్ష పార్టీల పోటాపోటీ భేటీలు :

మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) ఓటింగ్‌కు రానున్న సంగతి తెలిసి విపక్ష పార్టీల నేతలంతా రాజ్యసభలోని మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో ఉదయమే భేటీ అయ్యారు. ఈ బిల్లును ముందుకు తెచ్చి డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకోవాలన్న బీజేపీ కుట్రపై లోతుగా చర్చించారు. ఓటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీలన్నీ మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కానీ ఈ రెండు బిల్లులూ ఒకటిగానే ఓటింగ్‌కు వస్తున్నందున ఎలాంటి పరిణామం చోటుచేసుకుంటుందోననే ఉత్కంఠ మొదలైంది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున మోడీ ఇచ్చిన ‘ఆత్మప్రబోధానుసారం ఓటింగ్’ అనే ఎమోషనల్ అప్పీల్ ఏ మేరకు ఫలిస్తుందో తేలనున్నది. అధికార, విపక్ష పార్టీల కూటముల్లో ఏ పార్టీకి ఎంత బలమున్నదో పరిశీలిస్తే…

లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య : 541
ఎన్డీఏ కూటమి (బీజేపీ) బలం : 293
ఇండియా కూటమి (కాంగ్రెస్) : 234
ఆమోదానికి కావాల్సిన సంఖ్య :360
ఎన్డీఏ కూటమికి తగ్గిన ఓట్లు : 67
ఏ కూటమికీ చెందని ఎంపీలు : 14

Read Also: మహిళా బిల్లుతోనైనా ఆ మూడు పార్టీల‌ మనసు మారేనా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>