కలం, వెబ్ డెస్క్ : దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం, కోరికలు కోరుకోవడం సహజం. కోరిన కోర్కెలు నెరవేరితే కానుకలు సమర్పించుకుంటారు. కానీ, అనంతపురం జిల్లాలో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భక్తులు సాధారణంగా ఇళ్లు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, ఆరోగ్యం గురించి కోరుకుంటారు. అయితే, ఒక మహిళ మాత్రం తన అత్తపై ఉన్న కోపాన్ని దేవుడి హుండీ ద్వారా తెలియజేసింది.
అనంతపురం (Anantapur) జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో వెలిసిన ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. అధికారులు, సిబ్బంది భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్న సమయంలో ఒక రూ.20 నోటు వారి దృష్టిని ఆకర్షించింది. ఆ నోటుపై ఒక భక్తురాలు రాసిన వింత విన్నపం చూసి అధికారులు, అక్కడ ఉన్న భక్తులు ఆశ్చర్యపోయారు.
ఆ నోటుపై సదరు మహిళ “స్వామి.. అత్త వేధింపులు భరించలేకపోతున్నా, ఆమె త్వరగా చనిపోయేలా చూడు” అని రాసి హుండీలో వేసింది. అత్త పెట్టే బాధలను భరించలేక, ఆ వేదనను ఎవరికీ చెప్పుకోలేక నేరుగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే వేడుకుంటూ ఇలా నోటుపై రాసి ఉండవచ్చని అక్కడి వారు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా, హుండీ లెక్కింపులో బయటపడిన ఈ వింత కోరిక ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

