కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాలపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని మణికొండ మల్కం చెరువు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభమైంది. ఇటీవల జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్టీ శ్రేణులతో మాట్లాడారు. తెలంగాణలో జనసేనను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు తెలంగాణ నాయకులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీని బలోపేతం చేసేందుకు తాను తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తానని, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

