కలం, వరంగల్ బ్యూరో: ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) పాటిస్తూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, మీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తారని వరంగల్ సీపీ (Warangal CP) సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎల్కతుర్తి మండలం చింతల్పల్లి గ్రామంలో ఆరైవ్ ఆలైవ్పై గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీ సీపీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ సమయంలో అలర్ట్గా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపటం, సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదమన్నారు. ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు.
యువత అతివేగంగా వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడొద్దని, రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని సీపీ (Warangal CP) హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు ఎంతోమంది తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణమవుతున్నాయన్నారు. అనంతరం చింతల్పల్లి గ్రామంలోని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనపై తీర్మానం చేశారు. గ్రామస్తులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట డీసీపీ కవిత, ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, గ్రామ సర్పంచ్ రజితా రవీందర్, మార్కెట్ చైర్మన్ సంతాజీతో ఇతర పోలీస్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
Follow Us On: Instagram

