కలం, వెబ్ డెస్క్: మాతృత్వ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధమైన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్(Vinesh Phogat)కు ఢిల్లీ హైకోర్టు కీలక ఊరట ఇచ్చింది. ఆసియా గేమ్స్-2026 ఎంపిక ట్రయల్స్లో పాల్గొనడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆమె మళ్లీ అంతర్జాతీయ వేదికపై కనిపించే అవకాశాలు బలపడ్డాయి. మే 30, 31 తేదీల్లో జరగనున్న ఎంపిక ట్రయల్స్లో వినేశ్ ఫోగట్ను పాల్గొననివ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ట్రయల్స్ను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీడియో రికార్డ్ చేయాలని కోర్టు తెలిపింది. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ఒక్కో స్వతంత్ర పరిశీలకుడు హాజరుకావాలని సూచించింది. వినేశ్ ఫోగట్ వంటి ప్రతిష్టాత్మక క్రీడాకారిణులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఎంపిక విధానంలో లేకపోవడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా మాతృత్వ కారణాలతో విరామం తీసుకున్న క్రీడాకారిణుల విషయంలో కొంత స్వేచ్ఛ అవసరమని తెలిపింది.
ఆమెకు ఇచ్చిన షోకాజ్ నోటీసులోని కారణాలు ముందే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తున్నాయని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. క్రీడా ప్రయోజనాలు, న్యాయం దృష్ట్యా ట్రయల్స్లో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇంతకుముందు మే 18న సింగిల్ జడ్జి బెంచ్ ఆమెకు తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. ఆ నిర్ణయాన్ని వినేశ్ ఫోగట్ సవాల్ చేస్తూ అప్పీల్కు వెళ్లింది. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
వినేశ్ ఫోగట్ గతంలో పారిస్ ఒలింపిక్స్లో 50 కిలోల విభాగంలో ఫైనల్కు చేరుకుంది. అయితే వెయ్-ఇన్ సమయంలో 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో ఆమె అనర్హతకు గురైంది. ఆ ఘటన తర్వాత ఆమె కెరీర్పై అనేక చర్చలు జరిగాయి. ఇప్పుడు హైకోర్టు అనుమతితో వినేశ్ ఫోగట్ మళ్లీ ట్రయల్స్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ పరిణామం భారత రెజ్లింగ్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

