కలం, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధత బిల్లును (Amaravati Bill) స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju RaviChandra) వెల్లడించారు. ఈరోజు రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా రవిచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, ప్రజలు అన్నదమ్ముల్లా కలిసుందామని కోరుకున్నామని తెలిపారు. ఏపీని ఎంత అభివృద్ధి చేసినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కానీ విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని కేంద్రాన్ని విమర్శించారు. తెలంగాణకు హక్కుగా లభించిన వాటి విషయంలో కేంద్రం సానుకూలంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలనే అడుగుతున్నామని, రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.34 వేల కోట్లు, పీఎస్యూల నుంచి రూ.60 వేల కోట్లను అప్పుగా తెచ్చుకొని కట్టుకున్నామని చెప్పారు. కానీ, జాతీయ హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. కనీసం పాలమూరు ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ను ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) చేసిన వ్యాఖ్యలపై రవిచంద్ర మండిపడ్డారు. కేసీఆర్ సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారని, వీటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఒక్క ఆర్డినెన్సు ద్వారా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీకి ఇచ్చేశారని, ఏటపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాడు లాంటి గ్రామాలను కూడా కలిపేశారని గుర్తు చేశారు. చివరకు భద్రాచలం ఆలయానికి చెందిన భూములను కూడా ఏపీలో కలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మరిన్ని నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కోరారు. వరంగల్, కొత్తగూడెంలలో విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. 1932లో భద్రాచలం రోడ్డు పేరుతో రైల్వే స్టేషన్ ఉన్నదని, దాన్ని అభివృద్ధి చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టాలని ఎంపీ వద్దిరాజు (Vaddiraju RaviChandra) విన్నవించారు.
Read Also: మీకు నిధులా, మాకు బాధలా? మంత్రులూ.. ఖమ్మం ఏజెన్సీకి నిధులేవి!
Follow Us On : WhatsApp

