కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) సీరియస్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తెప్పించుకుని పరిశీలించినట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారం. అంతేగాకుండా, ఇటీవల కొందరు నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైనా మీనాక్షి ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. రేపు జరిగే ఏఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని అగ్ర నేతల వద్ద మీనాక్షి ప్రస్తావించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మేఘారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు..
వనపర్తి జిల్లాలో తన కార్యకర్తలను ఎమ్మెల్యే మేఘారెడ్డి వేధిస్తున్నారని చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంట్రాక్టులు దక్కడం లేదని ఎమ్మెల్యే కావాలనే పనులు ఆపేయించారని ఆరోపించారు. సోనియా గాంధీ తనకే సీటు ఇవ్వాలని చెప్పారని రాష్ట్ర నేతలకు సూచించారని చిన్నారెడ్డి గుర్తు చేశారు. కానీ, డబ్బులు పెట్టి సీటు కొనుక్కున్నారని ఆరోపించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపగా.. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఖండించారు. చిన్నారెడ్డిపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తాజాగా మీనాక్షి నటరాజన్ కూడా చిన్నారెడ్డి వ్యాఖ్యలపై దృష్టి సారించారు.

