కలం, వెబ్ డెస్క్: ఇరాన్ (Iran) నౌకాదళాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే లక్ష్యంతో అమెరికా (US) దళాలు తమ దాడులను ఉధృతం చేశాయి. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury)లో భాగంగా అమెరికా సైన్యం ఇరాన్కు చెందిన ఒక భారీ డ్రోన్ క్యారియర్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి విమాన వాహక నౌక పరిమాణంలో ఉన్న ఈ నౌక అమెరికా దాడులతో ప్రస్తుతం మంటల్లో చిక్కుకుంది. ఈ ఆపరేషన్ గురించి యూఎస్ సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ నౌకాదళాన్ని సమూలంగా నిర్మూలించే విషయంలో తాము ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేసింది.
మరోసారి ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సైన్యం ఆయుధాలు విడిచిపెట్టాలని సూచించారు. ఇరాన్ను దక్కించుకోవడానికి ఇదే సరైన సమయం అని వ్యాఖ్యానించారు. మాట వినకపోతే యుద్ధం ఆగదని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వంలో తమ ప్రమేయం ఉండాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. కొత్త నాయకత్వంపై తమ అభిప్రాయం తీసుకోవాలని సూచించారు.

