కలం, వెబ్ డెస్క్: రైతులు ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేయాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) ఆకాంక్షించారు. గుంటూరు కొర్నెపాడులో శనివారం నిర్వహించిన రైతు నేస్తం ఫౌండేషన్ (Rythu Nestham Foundation) పదో వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మిద్దెతోటలు సాగుచేస్తున్న మహిళలకు ఆయన అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మిద్దె తోటల పెంపకందారుల సమూహం ఉందని తనకు ఇప్పటివరకూ తెలియదని చెప్పారు. మిద్దె తోటల పెంపకం ప్రోత్సహిస్తున్న రఘోత్తమ రెడ్డి, వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. వ్యవసాయం చేసే చాలామంది రైతులకు ఆదాయం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ డిమాండ్పై అవగాహన పెంచుకున్నాక పంటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయంతో సరిపెట్టకుండా ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారని కొనియాడారు. రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితే లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైతులు సంఘటితమైతేనే వ్యాపారుల పెత్తనం తగ్గుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) కూడా ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తున్నారని గుర్తు చేశారు. మిద్దె తోటలకు బడ్జెట్ కేటాయింపుపైనా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

