కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఉబెర్ సంస్థ సీఈవో (Uber CEO) దారా ఖోస్రోషాహి బుధవారం జూబ్లీహిల్స్లోని భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉబెర్ ప్రతినిధులు మధు కన్నన్, ప్రభ్జీత్ సింగ్, ప్రవీణ్ నిప్పల్లి నాగతోపాటు సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ‘ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మరింత విస్తరిస్తున్నట్లు సీఈవో వెల్లడించారు. అమెరికా వెలుపల ఏర్పాటుచేసిన మొదటి సెంటర్లో ప్రస్తుతం 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణకు ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తిగా ఉన్నామని ప్రతినిధులు తెలిపారు.
అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న పార్కింగ్ సమస్యను సీఎం ప్రస్తావిస్తూ.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనపై సమగ్ర అధ్యయనం చేస్తామని ఉబెర్ ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాపార విస్తరణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

