కలం, స్పోర్ట్స్ : ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సిరీస్లో భాగంగా భారత్తో జరగనున్న తొలి టెస్ట్కు శ్రీలంక క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా వికెట్ కీపర్ కుసల్ మెండిస్ దూరం కావడంతో.. సీనియర్ ఆటగాడు నిరోషన్ డిక్వెల్లా (Niroshan Dickwella) తిరిగి జట్టులోకి వచ్చాడు. భారత్-శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు ధనంజయ డి సిల్వాను కెప్టెన్గా, కమిందు మెండిస్ను వైస్ కెప్టెన్గా నియమించారు. స్టార్ బ్యాటర్ పతుమ్ నిస్సంకను తొలి టెస్టుకు ఎంపిక చేయలేదు.
శ్రీలంక జట్టులో ఎవరెవరు?
బ్యాటింగ్ విభాగంలో లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, పసిందు సూరియబండార, సోనాల్ దినూషకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో రమేష్ మెండిస్, ప్రభాత్ జయసూర్య, కేశర నువాంత ఎంపికయ్యారు. పేస్ బౌలింగ్ విభాగంలో మిలాన్ రత్నాయకే, అసిత్ ఫెర్నాండో, లాహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక జట్టులో ఉన్నారు.
WTC పాయింట్ల పట్టికలో భారత్ 5వ స్థానం
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో శుభ్మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ఐదో స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడి 4 విజయాలు, 4 ఓటములు నమోదు చేసింది. 48.150 శాతం పాయింట్లతో కొనసాగుతోంది. మరోవైపు శ్రీలంక నాలుగు మ్యాచ్లలో ఒక విజయం, ఒక డ్రా, రెండు ఓటములతో ఆరో స్థానంలో ఉంది. సొంతగడ్డపై మ్యాచ్ జరగనుండటంతో శ్రీలంకకు పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది. దినేష్ చండిమాల్, నిరోషన్ డిక్వెల్లా వంటి సీనియర్ ఆటగాళ్ల అనుభవంతో టీమిండియాను ఎదుర్కొనేందుకు లంక సిద్ధమవుతోంది.

