కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veeraiah) నిప్పులు చెరిగారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని మర్లపాడు, కల్లూరుగూడెం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడ పేరుకుపోయిన ధాన్యం రాశులను చూసి చలించిపోయారు. గత 50 రోజులుగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు అండగా ఉండాల్సింది పోయి, నేడు కాంగ్రెస్ నాయకుల రాజకీయ అడ్డాలుగా మారాయని దుయ్యబట్టారు. కాంటా వేయాలన్నా, గన్నీ బ్యాగులు ఇవ్వాలన్నా పార్టీ రంగులు చూడటం దురదృష్టకరమన్నారు.
ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ మిల్లర్లను ఆశ్రయిస్తున్నారని, వారు తాలు పేరుతో బస్తాకు 12 కిలోల వరకు కోత విధిస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం వల్ల క్వింటాకు రూ. 800 వరకు రైతులు నష్టపోతున్నారని గణాంకాల్లో వివరించారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా రైతు గోస వినే తీరిక వారికి లేదని, కేవలం కమీషన్ల కోసమే పని చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాటం
”కేసీఆర్ పాలనలో రైతులు ధాన్యపు రాశుల వద్ద నిద్రపోయే పరిస్థితి లేదు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించింది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే వ్యవసాయ రంగాన్ని కుప్పకూల్చిందని ఆయన గుర్తు చేశారు. అనంతరం సండ్ర, ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసి, ఐకేపీ ఏపీఎంను క్షేత్రస్థాయిలో నిలదీశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి, తాలు కోత లేకుండా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు నిద్రపోమని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

