కలం, ఖమ్మం బ్యూరో: భవిష్యత్ తరాల కోసం ప్రతి చుక్క నీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని, రైతులు అధిక నీటి అవసరమున్న పంటలను వదిలి ప్రత్యామ్నాయ సాగుకే జై కొట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లా వి. వెంకటాయపాలెం డీప్కట్ వద్ద గోదావరి జలాల పరిస్థితిని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న ‘సూపర్ ఎల్నినో’ ప్రభావం వల్ల రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నారు.
అందువల్ల రైతులు వరి, మిర్చి పంటలకు బదులుగా ఆయిల్పామ్, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.గోదావరి జలాలను రాజీవ్ కాలువ షట్టర్లు మూసివేసి తిరిగి ఖమ్మం వైపు మళ్లించే వినూత్న ప్రయోగాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మంచుకొండ ఎత్తిపోతల ద్వారా చెరువులను నింపి మున్నేరులోకి నీటిని తరలించడం వల్ల ఖమ్మం నగర తాగునీటి అవసరాలు తీరుతాయని మంత్రి వివరించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసమే ప్రభుత్వం ‘యూరియా బుకింగ్ యాప్’ తెచ్చిందని, రైతులు ఎలాంటి రాజకీయ ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. వచ్చే జూన్ వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా పక్కా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం ఖమ్మం నగరంలోని 3, 4, 5 డివిజన్లలో రూ.1.75 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, సీఈ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

