Mobile Popup Ad
Mobile Popup Ad

అశాస్త్రీయంగా కనీస వేతనాల పెంపు : TMCWU నేత పీ. సురేశ్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : 14 ఏళ్ల తర్వాత కనీస వేతనాలు పెరిగాయని కార్మికులు సంబరపడాలా లేక అశాస్త్రీయంగా పెంచిన కనీస వేతనాలను చూసి కార్మికులు బాధపడడాలో తెలియని పరిస్థితి నెలకొన్నది అని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (TMCWU) రాష్ట్ర కార్యదర్శి పీ.సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరలు అనుగుణంగా కనీస వేతనాలు రూ.26 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కనీస వేతనాల పెంపు నిర్ణయంలో శాస్త్రీయత కొరవడిందని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి గత ఏడాదిన్నర కిందట అప్పటి పరిస్థితులను అధ్యయనం చేసి నైపుణ్యతను బట్టి వేతనం అందించాలని అనేక అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వానికి స్పష్టమైన నివేదికలు అందించిందని గుర్తు చేశారు. సమాజంలో 150 శాతం పైగా ధరలు ఆకాశానికి తాకుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు రూ. 26 వేలు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీధి పోరాటాలు నిర్వహిస్తున్నారని అన్నారు. 2012 నుంచి ఇప్పటివరకు దాదాపు 14 సంవత్సరాలు కనీస వేతనాలు పెంపునకు నోచుకోలేదన్నారు. దీంతో కార్మికులు తీవ్రమైన ఆర్థిక శ్రమ దోపిడికి గురయ్యారని ప్రస్తుతం పెంచిన కనీస వేతనాలు కార్మికులకు ఏ మాత్రం సరిపోవని చెప్పారు.

కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన జీవోలు వెలువడక ముందే తక్షణమే కార్మికుల విజ్ఞప్తుల మేరకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచి అమలు చేయాలని కోరారు. లేనిచో పోరాట కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మెడికల్ యూనియన్ బ్రాంచ్ నేతలు, కార్మికులు వై.రంగన్న, బి.చెన్నయ్య, అంజి, యాదయ్య, శ్రీను, రాఘవేందర్, గోపాల్, నరేష్, అంజమ్మ, నాగమణి,లక్ష్మమ్మ, నాగలక్ష్మి, పద్మ, చక్రి భాయ్, లక్ష్మి, చంద్రకళ, సుధా, మమత, నిర్మల, జ్యోతి, సునీత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>