కలం, వెబ్ డెస్క్: ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో ప్రజలకు కల్పించాల్సిన రక్షణ చర్యలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే సెలవులు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో కలెక్టర్లతో తరచూ సమావేశాలు నిర్వహించాలని సీఎస్ సాయి ప్రసాద్ను ఆదేశించారు.
అయిదు రోజులు ఎండలే.. ఎండలు..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే అయిదు రోజుల పాటు దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 26 వరకు కోస్తాంధ్రలో ఎండల ముప్పు, తీవ్ర వడగాల్పులు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

