కలం, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం (Sarva Darshan) కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిన్న శ్రీవారిని 82,172 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,978 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.5.15 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ (TTD) తెలిపింది. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణను టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

